Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

గణితరహస్యాలకు సంకేతం శంకర జయంతి

ఆదిశంకరులు వైశాఖ శుద్ధ పంచమినాడు అవతరించారు. ఆనాడు నక్షత్రం ఆర్ద్ర లేక పునర్వసు అవుతుంది. అది ఒక మహోత్కృష్ట పుణ్యదివసంగా పరిగణించడం నాకు అలవాటు. శివరాత్రి, గోకులాష్టమి, శ్రీరామనవమి మొదలగున్నవి ఎన్నో పుణ్యదివసాలు ఉన్నాయి. అయినా ఈఅన్నిటికంటే ఆచార్యుల జన్మదివసానికి ఒక విశిష్టత ఉంది.

కలియుగం ఆరంభ##మై రెండు వేల సంవత్సరాలు గడచిన మీదట జనులకు వేదపురాణాదులపై అనాదిగా ఉంటూ ఉన్న విశ్వాసానికి లోపం ఏర్పడింది. జనం అంతా బౌద్ధమతానుకూలాలైన ఉపదేశాల ప్రభావనికి లోనయ్యారు. అందరి మనస్సులమీద బౌద్దులు ఉపదేశాలు పీట పెట్టుకు కూర్చున్నాయి. పరంపరగా వచ్చే వైదికానుష్ఠానం లోపించింది. ఆ సమయంలో ఆచార్యుల పవిత్ర జన్మదివసం ఏర్పడింది. ఆచార్యుల జన్మదివసం కారణంగానే శివరాత్రి, శ్రీరామనవమి మొదలైన పుణ్య దివసాలు విస్మృతాలు కాకుండా మనకు దక్కేయి. అందుచే అన్ని పుణ్యదివసములకంటె ఆచార్యుల జన్మదివసమునందు మనం ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉన్నది. ఈ భవ్యదివసం మళయాళ##దేశంలో కాలడి గ్రామంలో ఆర్యాంబా శివగురువుల మంగళగృహంలో ఏర్పడిన సంగతి అందరకూ తెలిసినదే.

మళయాళ దేశంలో 'వృషాచలం' అనే మహాశివక్షేత్రం ఒకటి ఉంది. వృషం అంటే నందికేశ్వరుడు. ఆ క్షేత్రంలో వృత్తాకారంగా ఒక కొండ ఉంది. దానిమీద శివాలయం నిర్మింపబడి ఉంది. ఆ క్షేత్రంలో భజన చేసి జనులు స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు. భజన అంటే ఇక్కడ సేవ అని అర్ధం. ఆ స్వామి సన్నిధానంలో నెల లేక రెండు నెలలు ఉండి అచటి పుణ్యతీర్ధాలలో స్నానం చేసి స్వామిని సేవిస్తూ, స్వామి ప్రసాదం తింటూ, అచటనే నిద్రిస్తూ స్వామిని ఆరాధించడం ద్వారా పొందే వరప్రసాదాన్ని భజన అంటారు. నేడు కూడా ఆ విధంగా అక్కడ భజన చేస్తూ ఉంటారు. ఆ ఊరిపేరు శివపేరూరు. అరవభాషలో తిరుశబ్దానికి శ్రీ అని అర్ధం. ఆ కారణంగా ఆ ఊరిని 'తిరుశివపేరూరు' అని పిలిచేవారు. కాలక్రమేణ అది 'తిరుచ్చూరు'గా మారింది. ఆ క్షేత్రంలో వృషాచలస్వామికి ఆవునేతితో అభిషేకం చేస్తారు. స్వామికి అభిషేకం చేసిన ఘృతం ఎంతో నిలువ ఉంటుంది. ఆయుర్వేదంలో పురాతన ఘృతం చాలా వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. మళయాళంలో ఆయుర్వేదము, ఆయుర్వేద విద్యాభ్యాసము ఎక్కువ. ఈ నాడుకూడా పురాతన ఘృతం కావలసిన వైద్యులు ఈ ఆలయంనుండి ఘృతం తీసికొని వెడుతూ ఉంటారు. వేయియేండ్లకు వెనుకటి ఘృతం కూడా నేడు అక్కడ లభిస్తుంది.

మళయాళ##దేశంలో బ్రాహ్మణులను నంబూద్రీలు అంటారు. వారిలో వేదాధ్యయనం యెక్కువ. ఆచార్యులు ఈ బ్రాహ్మణశాఖయందే జన్మించేరు. వేదమతోద్ధారణకై అవతరించిన పరమశివుడు వేదాధ్యయన తత్పరులైన బ్రాహ్మణులయందే కదా జన్మించాలి.

శంకరవిజయంలో - దేవతలంతా పరమేశ్వరుని యొద్దకు పోయి పుడమి మీద కర్మానుష్ఠానానికి లోపం ఏర్పడిన దని, దానిని పునరుద్దరించాలని ప్రార్ధించగా, ఈశ్వరుడు తక్కిన అవతారములయందువలెనే ఫలానాదేవతలు ఫలానా మనుష్యులుగా అవతరించాలని ఆజ్ఞాపించినట్లు వ్రాయబడి ఉంది. అవతారాలు అన్నిటిలోనూ సాధారణంగా దేవతలు తమకు ఏర్పడిన రాక్షస బాధ తొలగించవలసినదిగా ప్రార్ధించినట్లు కానవస్తుంది. కాని ఈ అవతారంలో 'కర్మానుష్ఠానం తగ్గిపోయింది, దానిని పునరుద్దరించండి' అని ప్రార్ధించినట్లు చెప్పబడింది.

పురాణాలు దేవతలు ముప్పదిమూడుకోట్లమంది అని చెపుతున్నాయి. కొంతమంది ఈ సంఖ్యను పరిహస్తూ ఉంటారు. చదువుకొన్నవారికే సాధారణంగా దేవతలు ఎవరో తెలియదు. ఇక చదువు కొననివారికి, ఇతర మతస్థులకు ఎలా తెలుస్తుంది? మనలో కొంతమంది చదువురాని వారికి - 'దేవతలు ఎవరైతే యేమి' వారియందు భక్తి కలిగి ఉండడం మన కర్తవ్యం' అనే భావం ఉన్నది. చదువుకొన్నవారికి ఆ భావంకూడా లేదు. ఎందుచేతనంటే ఏ పుస్తకాలలో దేవతలు పురాణాలు అంతా బూటకం అని వ్రాయబడిందో వానినే అంతా చదువుతున్నారు.

మన మతగ్రంథాలలోను పురాణాలలోను ఎచట చూచినా దేవతల ప్రశంస ఎక్కువగా కానవస్తుంది. రామాయణంలో 'ఇంద్రుడు వచ్చేడు. వరుణుడు వెళ్ళేడు, దశరథుడు దేవలోకంలోకి పోయేడు' - అన్న విషయాలు ఉన్నాయి. ఇవి మనం చదువుతాం. కాని, ఇవి మనకు అర్థం అయినట్లూ, తెలిసినట్లు ఉండవు. మన తెలియనిదనమే దీనికి కారణం. అందుచే ఇదంతా కల్ల, బూటకం అనటం తగదు. గ్రంథాలలో ఆ దేవతలను గూర్చి ఏమేమి విషయాలు ఎలా చెప్పబడ్డాయో పరిశీలించకుండా వారిని గూర్చిన మాటలు అబద్ధాలు అనడం కూడదు. గాలి మన కంటికి కనబడుతూ ఉన్నదా? లేదు. అయినా మనం గాలి ఉన్నదని శరీరస్పర్శతో గ్రహించి అది ఉన్నదని నిర్ధారణ చేస్తున్నాము. అలాగే మొదటనే దేనిని గూర్చి లేదని చెప్పకూడదు. శాస్త్రాలు పరిశీలించాలి. నిశ్చయించాలి.

'పరమేశ్వరుడు తన్ను మూడు మూర్తులుగా విభజించుకొనును' అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆయన మూడు కాలాలలో మూడు రకాలైన వేషాలు ధరిస్తాడు. సృష్టి స్థితి సంహారాలకు తిరోధానము, అనుగ్రహము అనే వానిని కూడా చేర్చి పరమేశ్వరుడు ఐదు మూర్తులుగా ఉన్నట్లు చెపుతారు. అందుచే 'శివుడే గొప్ప అనే శైవుడూ, విష్ణువే అధికుడు' అనే వైష్ణవుడు ఇద్దరును మూర్ఖులే. రెండు ఉన్నాయనుకొని వానిలో తరతమభావాలు ఏర్పాటు చేసికోవడం తప్పు. మనకు వేరు వేరుకాలాలలో వేరువేరు వేషాలు ఉన్నటులే పరమేశ్వరునకు కూడా కార్యానికి తగిన వేషాలు ఉన్నాయి. ఆయనకు మన కంటే శక్తి అధికం కావడంచేత ఒకే కాలంలోనే ఆయనకు కార్యభేదము, వేషభేదమూ ఉన్నాయి.

స్వామి ఒక్కడే ఇన్నిలోకాలను సృష్టించి రక్షిస్తున్నాడు. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక సూర్యుడని, సూర్యునకు వలెనే ప్రతి నక్షత్రానికి గ్రహాలు ఉన్నాయని ఈ నాడు చెపుతున్నారు. మన పురాణాలు ఏనాడో ఎన్నోలోకాలు, అనేక లోకాలు ఉన్నాయని చెప్పేయి. ఇన్నిచోటులందు పుట్టి పెరిగే ప్రాణులకు అన్నము వస్త్రము కావాలికదా! ఆ అన్న వస్త్రాలకు పంచభూతాలు అవసరం. మనదేహం పంచభౌతికమే. భూమిలో వృద్ధిచెందే పదార్థాలన్నీ పాంచభౌతికాలే. ఈ సంచభూతాలే వేర్వేరు రకాలుగా మిళితం అయి వేర్వేరు పదార్థాలుగా అవుతున్నాయి. ఆహారంలో మూలమైన రుచులు ఆరే అయినా వాని సమ్మిశ్రణముచే అనేకరుచులు ఏర్పడతూ ఉన్నట్లే ఈ పంచభూతముల వలన అనేక భిన్నపదార్థాలు, సర్వపదార్థాలు ఏర్పడుతున్నాయి. పదార్థ పరిశోధనం చేసే శాస్త్రజ్ఞులు కూడా పదార్థానికి మూలం ధాతువే అని నిర్థారించేరు. మన శాస్త్రములు పంచభూతాలనే ధాతువులుగా నిశ్చయించేయి. ఈ పంచభూతాలు ప్రాణులకు హితకారులుగా రక్షకములుగా ఉండాలి.

ఒకరాజు ఉంటే ఆయన పంచ భూతాలను తన ఆధీనంలో ఉంచుకొనడానికి యత్నిస్తాడు. ఈ భూభాగం నాది అంటాడు. సముద్రంలో కొంతమేర చూపి ఇది నాది, ఈ జలభాగం మీద నేను అధికారిని అంటాడు. ఆకాశానికి కూడా పొలిమేరలు కల్పించి, ఇది నా ఆకాశం, ఇచ్చట నా అనుమతి లేకుండా విదేశాల విమానాలు సంచరించడానికి వీలులేదని ఆన పెడుతాడు.

అట్లే ఈశ్వరుడు పంచభూతాలకు తాని యజమానియై తనపాలనలో ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారిని నియమిస్తాడు. జలముల మీద అధికారి ఒకడు, పైరు పచ్చలకు అధికారి ఒకడు, ఆకాశము పై అధికారి ఒకడు-ఇలా వేర్వేరు అధికారులను నియమిస్తాడు. ఆ అధికారులంతా జనక్షేమానికి నియమింపబడినవారే. ఆ అధికారులకు ఆహారం జనులేకల్పించాలి. దేవతలంతా ఇటువంటి అధికారులే. రాజు ఒక్కొక్కనికి ఒక్కొక్క అధికారం యిచ్చినట్లే ఈశ్వరుడున్నూ యిచ్చిఉన్నాడు, మూడులోకాలమీద ఇంద్రుడు అధికారి. ఆయన పదవి గొప్పది. ఆయన క్రిందవారే దేవతలు. పరిపాలనకై వారికి కొన్ని శక్తులు ఒసగబడ్డాయి. ఈ దేవతలకు అందరకు జ్ఞానశక్తి క్రియాశక్తి ఎక్కువ.

దేవతలకు ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆధిదైవికము అని మూడేసి రూపాలు ఉన్నాయి. ప్రాణుల యొక్క ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతాస్వరూపం సంస్థితమై ఉంటుంది. ఆ దైవరూపాలకే 'ఆధ్యాత్మికము' అని పేరు. వారు ఆయా అవయవాలయందు ఉండి ప్రాణులను రక్షిస్తూ ఉంటారు. మంత్రజపాదులయందు మనంచేసే అంగన్యాస కరన్యాసాలు ఆ దేవతలను ఉద్దేశించియే చేస్తున్నాం. లోకంలోని అధికారులకు మనం విన్నవిస్తే కాని ఏ విషయమూ తెలియదు. కాని వీరి విషయం అలాంటిదికాదు. ఎవరూ తెలుపకపోయినా తెలుసుకొనే శక్తి వీరికి ఉన్నది.

ప్రాణి శరీరావయవాలలోనే కాక ప్రపంచంలోని సమస్త వస్తువులలోనూ దేవతలు ఉన్నారు. దేవతలయెక్క ఈ రూపం ఆధిభౌతికం అనబడుతుంది. ఈ రూపంలో వీరు ప్రంచంలోని ఏ పదార్థమైనా అపరిశుద్ధంగా ఉంటే శిక్షిస్తూ ఉంటారు. దేవతలు ఇక్కడ యిలా ఉన్నట్లు ఉపనిషత్తులు చెపుతున్నాయి.

పై రెండేకాక దేవతలకు ఉండే మూడవరూపం ఆధిదైవికం. ఆ రూపంతో వారు దేవలోకంలో శరీరం ధరించి ఉంటారు. కాగా ప్రాణి దేహావయవాలలోను, సర్వపదార్థాలలోను, వేరే దేవలోకంలోను దేవతలు మూడు రూపాలు ధరించి ఉన్నారు.

లోకంలోని ప్రభుత్వంలో జలానికి సంబంధించి ఒక ఇంజనీయరు ఉన్నట్లే దేవతలలో జలాధికారి వరుణుడు. ప్రభుత్వంలోని ఇంజినీయరుకు తంతీ మూలంగా తెలిపితే కాని విషయం తెలియదు. కాని ఈయనకు అలాకాదు. శరీరంలో ఎక్కడ గిల్లినా ఈయన ప్రత్యక్షం అవుతాడు. తీర్థములు అన్నీ వరుణుని దేహాలే. ఇలా ఉండే దేవతలు ముప్పదిమూడుకోట్లమంది. ప్రతిశరీరంలోను దేవతలు, వారిలో పరమేశ్వరుడు ఉన్నారు.

కర్మానుష్ఠానమే మనం దేవతలకు ఇచ్చే కప్పం. కోర్కెలు ఉన్నంతవరకు మనం దేవతలను అనుగమించాలి. లేకపోతే కష్టాలు కలుగుతాయి.

'దుర్భిక్షం దేవలోకేషు మనూనాముదకంగృహం'- అని వరుణ ప్రశ్నలో ఉంది. దేవతలకే కరవుకాటకాలు కాని, మనుష్యులకు ఏ లోపములేదు; అన్నీ వీరికి సమృద్ధిగా ఉన్నాయని అందులో చెప్పబడింది. ఏమంటే దేవతలకు ఆహారం ఇక్కడ నుండియే వెళ్ళాలి. మనము చేసే కర్మానుష్ఠానమే వారికి ఆహారం. దానిచేతనే వారు ఆనందిస్తారు. అందుచే భూమి మీద కర్మానుష్ఠానానికి లోపం ఏర్పడితే దేవతలంతా పరమేశ్వరుని దగ్గరకు పోయి ఆ దుస్థితిని తొలగించ వలసినదిగా ప్రార్ధిస్తారు.

పరమేశ్వరుడే అవతరించాలి అంటే ఆ సమయం సాధారణసమయంగా ఉండకూడదు. అది ఒక ఘనతరపుణ్య సమయంగా ఉండాలి. అవతరించే పరమేశ్వరుని సందర్శించదగిన పుణ్యాత్ములు ఆ సమయంలో ఉదయించాలి. అలా ఉదయించిన వారికి ఈశ్వర దర్శనభాగ్యం కలిగించేదిగా ఆ కాలం ఉండాలి. ఈ అందరకు సేవచేయడానికై పుణ్యాన్ని పండించుకొన్న భాగ్యవంతులుకూడా జన్మించడానికి వీలుగా ఆ కాలం ఉండాలి. ఇలా పరమేశ్వరావతార కాలం పరమపుణ్యముతో ఘనీభవించినదై ఉంటుందే కాని సాధారణంగా ఉండదు.

వృషాచలంలో శివగురువు ఆర్యాంబ పుత్ర ప్రాప్తిని కోరి స్వామికి భజన చేస్తూ వచ్చేరు. శివగురువు యొక్క తండ్రి పేరు విద్యాధిరాజు. ఒకనాడు స్వామి శివగురువునకు స్వప్నంలో దర్శనం యిచ్చేరు. అలా దర్శనం యిచ్చిస్వామి మీకు దీర్ఘయుష్కులు, మూర్ఖులు అయన నూరుగురు పుత్రులు కావాలా, లేక అల్పాయుష్కుడై, సర్వజ్ఞుడైన ఒక్క కుమారుడు కావాలా! అని ప్రశ్నించేరు. శివగురువుకు ఏమి కోరాలో తెలియలేదు. ''స్వామి! నేను ఈ విషయమై నా భార్యను అడిగి నిర్ణయించి మీకు విన్నవిస్తాను'' అన్నాడు శివగురువు. అంతే! కల చెదరింది. మెలుకువ వచ్చింది. ఆయన తన భార్య ఆర్యాంబతో తనకు కలిగిన స్వప్నం విషయం చెప్పగా ఆమే తనకు కూడా ఇట్టి స్వప్నమే వచ్చింది అని అన్నది. అపుడు భార్యాభర్తలు ఇద్దరూ స్వామికి నమస్కరించి - ''ప్రభూ! మమ్మెందుకు ఇలా పరీక్షిస్తావు. ఏది మాకు మేలని నీవు భావిస్తావో అదే చెయ్యి; ఆ వరమే ప్రసాదించు'' అని ప్రార్థించేరు. అపుడు పరమేశ్వరుడు తానే స్వయంగా వారి యింట అవతరిస్తానని, కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటానని వారికి తెలిపేడు.

ఆర్యాంబా శివగురువులు గ్రామానికి చేరుకొన్నారు. భజన పూర్తి కాగానే సమారాధన చేయడం ఒక ఆచారం. శివగురువు సమారాధన చేసేడు. బ్రాహ్మణులు తృప్తిగా భుజించేరు. అలా బ్రాహ్మణులు భుజించగా మిగిలిన ప్రసాదాన్ని ఆర్యాంబ స్వీకరించింది. అపుడు ఐశ్వర్యమైన (ఈశ్వరసంబంధమైన) తేజం ఆమే గర్భంలో ప్రవేశించింది. ఆమె గర్భవతియై తొమ్మిదినెలలు నిండగానే ఆచార్యులవారిని ప్రసవించింది. జాతకర్మ చేయబడింది. పుట్టిన పదునారవరోజున శిశువుకు నామకరణం చేయాలి అనుకొన్నారు. మళయాళ##దేశంలో జన్మ నక్షత్రమును జన్మతిథిని పేరుగా పెట్టుకొనే సంప్రదాయం ఒకటి ఉంది. తిరువాన్కూరు మహారాజులలో 'మూలతిరునాళ్‌, విశాఖ తిరునాళ్‌' అనే పేర్లు కలవారు ఉన్నారని చాలామంది ఎరుగుదురుకదా! ఆవిధంగానే శిశురూపంలో ఉన్న శివునకు నామకరణం చేయదలచేరు.

మన ప్రాచీనశాస్త్రాలన్నీ శ్లోకరూపంగానే ఉన్నాయి. సంగీతం, వైద్యం, గణితం అన్నీ శ్లోకాలుగానే ఉన్నాయి. ఏమంటే ఏ విషయం చెప్పినా భోధించినా పుస్తాకాపేక్ష ఉండకూడదు. అందుచే విషయం మననయోగ్యంగా ఉండాలని అన్ని శాస్త్రాలను శ్లోకరూపంలో నిబంధించేరు. శాస్త్రాలే కాదు నిఘంటువులుకూడా శ్లోకరూపంగానే ఉన్నాయి. అమరకోశం శ్లోకరూపంగానే కదా ఉన్నది! ఇలా శ్లోకరూపంగా ఉన్నవానిని మననం చేయడం తేలిక. అందువల్లనే ప్రాచీన కాలంలో పండితులు చలనపుస్తకభాండాగారాలవలే (వాకింగు లైబ్రెరీస్‌) ఉండేవారు. కాగా పూర్వకాలం గణితం కొన్ని సంకేతాలు ఆధారంగా శ్లోకరూపంలో ఉండేది.

ఆచార్యులు 'శరచరాబ్దం' లో పుట్టేరట. అబ్దం అంటే సంవత్సరం. ఇక 'శరచర' అంటే ఏమిటి? అన్న ప్రశ్న పుడుతుంది. దానికి కొన్ని గణిత సంకేతాలు తెలియాలి.

అంకెలను అక్షర సంకేతాలలో చెప్పడం ప్రాచీనవిధానం. 'కాది నవ, టాది నవ, రు పంచ, యాద్యష్టౌ' అని ఇలా ఆ సంకేతాలు ఉన్నాయి. అంటే 'క' మొదలు 'ఝ' వరకు తొమ్మిది అక్షరాలు ఉన్నాయి కదా! ఆ అక్షరాలు క్రమంగా ఒకటి నుండి తొమ్మిది వరకు ఉండే అంకెలను సూచిస్తాయి అలాగే 'ట' మొదలు 'ధ' వరకు ఉండే అక్షరాలను కూడా ఒకటి మొదలు తొమ్మిదివరకు ఉండే అంకెలను సూచిస్తాయి. 'ప' మొదలు 'మ' వరకు ఉండే అక్షరాలు ఒకటి మొదలు ఐదు వరకు ఉండే అంకెలను సూచిస్తే; 'య' మొదలు 'హ' వరకు ఉండే అక్షరాలు ఒకటి మొదలు ఎనిమిదివరకు ఉండే అంకెలను సూచిస్తాయి. కేవలములైన అచ్చులు సున్నలను సూచిస్తాయి. ఈ అంకెలను కుడినుండి ఎడమకు లెక్కించాలి. అంటే ఎడమవైపు ఉండేదే ఒకట్లస్థానం అవుతుంది.

ఇప్పుడు 'శరచర' శబ్దాన్ని విడదీసి చూడవచ్చు. 'యాద్యష్టౌ' అనే సూత్రమును అనుసరించి 'శ' వర్ణం ఐదును సూచిస్తే 'ర' రెండును సూచిస్తుంది. 'కాది నవ' అనే సూత్రం ప్రకారం 'చ' ఆరును సూచిస్తుంది. 'ర' తిరిగి రెండునే సూచిస్తుంది. వీనిని తలక్రిందు చేస్తే 2625 అవుతుంది. కాగా ఆచార్యులు కలియుగం ఆరంభం అయిన తరువాత 2625 సంవత్సరములకు జన్మించారని అర్ధం.

ఆచార్యులకు వారి జన్మదివసాన్ని అనుసరించి పేరు పెట్టవలె ననుకొన్నారు. ఆలోచించి 'శంకర' అని పేరు పెట్టేరు. వేదంలోని 'శంకర' పదం చూచి వారు ఈ పేరు పెట్టలేదు. భగవత్పాదుల అవతారదివసాన్ని బట్టియే ఈ పేరు పెట్టేరు. వారు వైశాఖ శుద్ద పంచమినాడు అవతరించేరు. అనగా ఐదవ తిథి, ఒకటవ పక్షం, రెండవమాసం అయినాయి. ఈ అంకెలను 'శంకర' అనే అక్షరాలు సూచిస్తాయి. 'యాద్యష్టౌ' అనే సూత్రాన్ని అనుసరించి 'శ' అంటే ఐదు. 'కాది నవ' అనే సూత్రాన్ని అనుసరించి 'క' అంటే ఒకటి తిరిగి 'యాద్యష్టౌ' అనే సూతప్రకారం 'ర' అంటే రెండు అవుతుంది. వీనిని తిరుగవేస్తే 'రెండవమాసం మొదటి పక్షం ఐదవ తిథి' అనే అర్ధం వస్తుంది. ఇలా తిథి పక్షమాసాలను సూచించే సంఖ్యాసంకేతంగా 'శంకర' నామధేయం వీరికి ఏర్పడింది. ఆచార్యులకు తల్లిదండ్రులు పెట్టినపేరు ఇదే.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page